
చెన్నై, సూర్య న్యూస్ : భారతీయ జనతా పార్టీకి (BJP) రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి (Former IPS) కె. అన్నామలై (K Annamalai) తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరతీశారు. ఆయన తాజాగా ప్రకటించిన ‘వి ద లీడర్స్’ (We the Leaders) ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఆన్లైన్ వేదికగా తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని అన్నామలై పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వెబ్సైట్ (Website) ద్వారా ఆన్లైన్ లింక్ ను అందుబాటులో ఉంచారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే సుమారు 14 లక్షల మంది ఈ ఉద్యమంలో చేరినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈ కొత్త ప్రయాణానికి అండగా నిలుస్తున్నారు.
స్వచ్ఛంద సేవకులే తమ ఉద్యమానికి జీవనాడి అని ఆయన వెబ్సైట్ లో పొందుపరిచిన సందేశంలో పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం (Health), పర్యావరణం వంటి రంగాల్లో క్షేత్రస్థాయిలో నిజమైన మార్పు తీసుకురావాలని ఆయన కోరారు. సామాన్యులు, విద్యావంతులు, నిపుణులు రాజకీయాల్లోకి (Politics) రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రజల కోసం పనిచేసే తపన మాత్రమే తనకు ఉందని చెబుతూ, తన ప్రసంగంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) పేరును ఆయన పదేపదే ప్రస్తావించారు.
తమిళనాడు (Tamil Nadu) ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాల్లో బీజేపీ అధిష్టానంతో తనకు తీవ్ర విభేదాలు వచ్చినట్లు అన్నామలై బహిరంగంగా అంగీకరించారు. రాష్ట్ర గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం విషయంలో తాను ఎప్పుడూ వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. డీఎంకే (DMK), అన్నాడీఎంకే, టీవీకే పార్టీల తరహాలోనే ఇకపై బీజేపీని కూడా చూస్తానని ఆయన కుండబద్దలు కొట్టారు. రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) తమ ఉద్యమం తరఫున పోటీ చేస్తామని ప్రకటించారు. అలాగే 2031 అసెంబ్లీ ఎన్నికలే (Assembly Elections) లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. శాశ్వత ఎమ్మెల్యేలు, ఎంపీలు అనే సంస్కృతికి ముగింపు పలికి, ప్రజలు కేంద్రంగా సాగే రాజకీయాలను నిర్మిస్తామని అన్నామలై స్పష్టం చేశారు.
📲 మరిన్ని తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్ కోసం Surya News WhatsApp Channel లో చేరండి 👇
