
హైదరాబాద్, సూర్య న్యూస్: వరల్డ్ క్రికెట్లో ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ నుంచి మొదలైన ఇతని విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2026 సీజన్లో ఏకంగా ఆరెంజ్ క్యాప్ (Orange Cap) గెలిచిన ఈ కుర్రాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే సీజన్లో 72 సిక్సర్లు బాది వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. అతడి ఆటను చూసేందుకు జనాలు స్టేడియానికి భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కోచ్గా వ్యవహరిస్తున్న కుమార సంగక్కర (Kumar Sangakkara) కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు.
ఆ ఫాస్ట్ బౌలర్ల ఈగో హర్ట్ అయింది
గతేడాది రాజస్థాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు గౌహతిలో రెండు వారాల క్యాంప్ ఏర్పాటు చేశామని సంగక్కర తెలిపాడు. అప్పుడే వైభవ్ సూర్యవంశీని మొదటిసారి నెట్స్ లో చూశానని చెప్పాడు. మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రాని ఆ చిన్న పిల్లాడు నెట్స్ లో అదరగొట్టాడు. జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) మరియు సందీప్ శర్మ (Sandeep Sharma) వంటి ఫాస్ట్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కొత్త బంతితో వాళ్లు వేసే పేస్ని తట్టుకోవడం చాలా కష్టం. కానీ వైభవ్ ఎంతో నమ్మకంగా ఆడాడు. అతను కొట్టే ఒక్కో షాట్ గన్షాట్లా వినిపించింది. అతని బ్యాటింగ్ చూసి ఆర్చర్ ఇగో హర్ట్ అవ్వగా సందీప్ శర్మ అస్సలు తట్టుకోలేకపోయాడు. చివరకు ఆర్చర్ బౌలింగ్ చేయడం ఆపేసి ఏం చేయాలో తెలియక నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడే అతని టాలెంట్ అర్థమై రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) దగ్గరికి వెళ్లాను. ఈ పిల్లాడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడించండి అతను రెడీగా ఉన్నాడని చెప్పాను.
’కోచ్… టెన్షన్ పడకండి, కొట్టేస్తాం’
ఈ ఏడాది లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్లో 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజింగ్ చేస్తున్నాం. అప్పుడు వైభవ్ వచ్చి కన్ను గీటి కోచ్ టెన్షన్ పడకండి కొట్టేస్తాం అని అన్నాడు. నా పక్కనే ఉన్న డోనోవన్ ఫెర్రెరియా మరియు లువాన్-డే ప్రిటోరియస్ దగ్గరికి వెళ్ళాడు. నేను ఈరోజు 13 సిక్సర్లు కొడతాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. అతని కాన్ఫిడెన్స్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. చెప్పినట్లుగానే ఆ మ్యాచ్లో 10 సిక్సర్లు కొట్టాడు. అతను 5 సిక్సర్లు కొట్టగానే నిజంగానే 13 సిక్సర్లు కొడతాడేమో అని ఫెర్రెరియా ఆశ్చర్యపోయాడు. 15 ఏళ్ల కుర్రాడికి తన టాలెంట్పై అంత ఆత్మవిశ్వాసం ఉండటం చాలా అరుదు అని సంగక్కర ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
38 బంతుల్లో 93 పరుగులు.. రెండో టీ20లో ఛాన్స్?
ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు మరియు 10 సిక్సర్లతో 93 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇతని సూపర్ ఇన్నింగ్స్ కారణంగా 220 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే ఐర్లాండ్ (Ireland) తో జరిగిన మొదటి టీ20లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్లో భారత జట్టు (Team India) 34 పరుగుల తేడాతో ఓడిపోయి ఘోర పరాభవం మూటకట్టుకుంది. దీంతో జూన్ 28న జరిగే రెండో టీ20 మ్యాచ్ లో వైభవ్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



