
హైదరాబాద్, సూర్య న్యూస్:దేశవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్న యూపీఐ (UPI) చెల్లింపులపై ఫోన్పే (PhonePe) సీఈఓ సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు. డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. భారతీయ వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.
ఇటీవల యూపీఐ లావాదేవీల (UPI Transactions) ఛార్జీల వసూలుకు సంబంధించిన బిల్లు లోక్సభలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో సాధారణ వినియోగదారుల్లో తమ పేమెంట్స్ పై ఛార్జీలు పడతాయనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో యూజర్లకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని ఫోన్పే సహ వ్యవస్థాపకుడు (Co-founder) సమీర్ నిగమ్ తెలిపారు. యూపీఐ వ్యవస్థను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉచితంగా కొనసాగించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) విధించేందుకు చట్టపరమైన మార్పులపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే దీనిపై తుది విధానం ఇంకా ఖరారు కాలేదు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. అలాగే చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారులు సైతం యూపీఐ చెల్లింపులు స్వీకరించడానికి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR Rate) చెల్లించాల్సిన అవసరం లేదని పేమెంట్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




