
Hyderabad, Surya News: తెలంగాణవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులు (Auto and Cab Drivers) చేపట్టాలని భావించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రభుత్వంతో జరిపిన ఉన్నత స్థాయి చర్చలు ఫలించడంతో ఆందోళనను విరమించుకుంటున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ నిర్ణయంతో సోమవారం ఉదయం నుంచి నగర వీధుల్లో ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లు యథావిధిగా నడవనున్నాయి.
ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాలని యూనియన్లు నిర్ణయించగా, పాఠశాల విద్యార్థుల రవాణా వాహనాలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని భావించాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులు యూనియన్ల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ యాప్ ద్వారా పాల్గొని కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు.
ఆటో డ్రైవర్లకు వార్షిక ఆర్థిక సాయం అందించే అంశంపై త్వరలోనే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆటో ఛార్జీల సవరణకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, 15 రోజుల్లోగా ఆ కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఆయన వెల్లడించారు. అలాగే ఈవీ ఆటోల కొనుగోలుకు రుణాలు అందించేందుకు ఆర్థిక సంస్థలతో మాట్లాడతామని, రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రుల సంయుక్త సమావేశం నిర్వహించి, అనంతరం అసెంబ్లీలో కూడా చర్చించి తగిన జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు యూనియన్లు తెలిపాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



