
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అనకాపల్లి కేవలం బెల్లం ఉత్పత్తికే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తే నీటి ఎద్దడి తలెత్తుతుందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తిప్పికొట్టారు. డేటా సెంటర్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే నీళ్లు ఇంకిపోయాయని చెప్పడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పారు. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు గోదావరి జలాలు త్వరలోనే అందుతాయని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఈ పనులు వేగవంతం చేస్తామని, సెప్టెంబర్ తొలి వారంలోనే పూర్తి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు సమాజంలోని కొందరు విమర్శలు చేస్తారని, అయినా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు అభివృద్ధిని అభిమానిస్తే అదే తమకు అసలైన తృప్తి అని పేర్కొన్నారు.
ఈరోజు అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం అలమండలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ఆ తర్వాత పార్టీ కేడర్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, నీటిపారుదల, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



