
న్యూఢిల్లీ, సూర్య న్యూస్: దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం (RTE Act, 2009), నూతన జాతీయ విద్యా విధానం (NEP 2020) అమలులో భాగంగా పాఠశాలల అందుబాటు, నమోదు నిష్పత్తులలో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు తాజా యూడైస్ ప్లస్ (UDISE+) నివేదిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రామాల్లో పాఠశాలల లభ్యతను తెలిపే గ్రాస్ యాక్సెస్ రేషియో (GAR) గత కొన్నేళ్లలో రికార్డు స్థాయిలో పెరిగింది. 2018-19లో హయ్యర్ సెకండరీ స్థాయిలో 65.05 శాతంగా ఉన్న యాక్సెస్ రేషియో, 2024-25 నాటికి ఏకంగా 94.97 శాతానికి చేరింది. సెకండరీ స్థాయిలో 88.24 శాతం నుంచి 95.35 శాతానికి విస్తరించగా, ప్రైమరీ స్థాయిలో 97.83 శాతం, అప్పర్ ప్రైమరీలో 96.57 శాతం ఆవాసాల్లో పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.
పాఠశాలల్లో విద్యార్థుల నమోదు నిష్పత్తి (GER) గణాంకాల్లోనూ సామాజిక వర్గాల భాగస్వామ్యం బలంగా కనిపించింది. ప్రైమరీ స్థాయిలో ఎస్టీ వర్గాల నమోదు 98.0 శాతంగా ఉండగా, అప్పర్ ప్రైమరీలో ఎస్సీల నమోదు 94.7 శాతం, ఎస్టీల నమోదు 98.7 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా మౌలిక వసతుల కల్పన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs), నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు, పీఎం-పోషణ్ కింద వేడి భోజనం, అలాగే 14,500కు పైగా పాఠశాలలను పీఎం శ్రీ (PM SHRI) కింద ఆధునీకరించడం విద్యారంగ సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



