
Hyderabad, Surya News: తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల (Private Schools) ఫీజుల దోపిడీని అడ్డుకునేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సిద్ధమైంది. విద్యా హక్కు చట్టం (RTE Act) అమలు కోసం ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ (Indira Park) వద్ద మహాధర్నాను నిర్వహించనున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొనాలని టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) పిలుపునిచ్చారు.
రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు చట్టం (Right to Education) ద్వారా పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు దక్కాల్సి ఉంది. కానీ ఈ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని ఆయన ఆరోపించారు. కోర్టులు ఆదేశించినా సరే ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. అక్షరం ఎప్పటికీ అమ్మకానికి కాదని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేట్ శక్తులు (Corporate Forces) స్కూలు ఫీజుల పేరిట సామాన్యుల రక్తాన్ని పిండుతున్నాయని ఆయన మండిపడ్డారు.
అప్పులు చేసి చదువులు కొనాల్సిన దుస్థితి నుంచి ఇకనైనా బయటపడాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. ఇన్నాళ్లు తెలియక మోసపోయామని, ఇప్పుడు మన హక్కులు తెలుసుకుని కూడా ఇంట్లో కూర్చుంటే బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన వారమవుతామని ఆయన హెచ్చరించారు. సామాన్యుడికి సైతం నాణ్యమైన చదువు దక్కాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం ఒక్క రోజు సమయం కేటాయించాలని ఆయన కోరారు. ఈ నెల 26న జరిగే ఛలో ఇందిరా పార్క్ (Chalo Indira Park) మహాధర్నాను విజయవంతం చేసి ఫీజుల దోపిడీని ఎండగట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.