
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఆశించే నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రంలోని పలు విభాగాల్లో ఏకంగా 1,748 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అర్హతలు, వయోపరిమితి
జూనియర్ ఇంజినీర్ (Junior Engineer) విభాగంలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి సంబంధిత బ్రాంచ్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని నిర్దిష్ట పోస్టులకు సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా తప్పనిసరి. అభ్యర్థుల వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం, వేతనం
అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము కింద అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in ను సందర్శించవచ్చు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



