
చండూరు, సూర్య న్యూస్ : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చండూరు మున్సిపల్ అధ్యక్షుడు భూతరాజు శ్రీహరి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ, తహశీల్దార్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అధికారిక కార్యక్రమాలు చేపట్టకపోతే, ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై జాతీయ జెండాలను ఎగురవేస్తామని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలు, జమీందారీ వ్యవస్థ దోపిడీ నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిన చారిత్రక రోజని ఆయన గుర్తుచేశారు. ఇంతటి మహోన్నతమైన ఘట్టాన్ని గత ప్రభుత్వాలు మజ్లిస్ పార్టీకి భయపడి, వారి చేతిలో కీలుబొమ్మలుగా మారి అధికారికంగా నిర్వహించలేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.
గత పాలకుల తీరునే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబించకుండా, వెంటనే సెప్టెంబర్ 17 వేడుకలను అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు అన్నెపర్తి యాదగిరి, బోడ ఆంజనేయులు, తడకమళ్ళ శ్రీధర్, రావిరాల శ్రీను, సామ వెంకట్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పేర్ల గణేష్ పాల్గొన్నారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శులు పడసబోయిన శ్రీను, సోమ శంకర్, ఆవుల అశోక్ తో పాటు స్థానిక నాయకులు పల్లపు స్వామి, కడారీ నర్సింహ, దోటి కిరణ్, కర్నాటి శ్రీను, మంచుకొండ సాగర్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



