
హైదరాబాద్, సూర్య న్యూస్ : సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో (Bolaram Army Theft) జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ ఘటనలో నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ అధికారి మల్లేష్ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ఆయుధాలను తన సొంతూరు తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా ఓ గుంతలో పాతిపెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో (Telangana Police) వెలుగుచూసింది.
రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31వ తేదీన బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ స్టోర్ రూమ్ తాళాలు పగలగొట్టిన నిందితుడు, లోపల ఉన్న పలు పిస్టళ్లు, మ్యాగజైన్లు, భారీ సంఖ్యలో బుల్లెట్లను అపహరించాడు. ఆ తర్వాత వాటిని నేరుగా తన స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లికి తరలించాడు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ ఓ గొయ్యి తీసి ఆ ఆయుధాలను అందులో భద్రపరిచాడు.
ఆయుధాలు మాయమైన విషయం గుర్తించిన ఆర్మీ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, సైనిక ఇంటెలిజెన్స్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు వేగవంతం చేశారు. పక్కా సమాచారంతో మల్లేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడు పాతిపెట్టిన ఆయుధాలను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. సైన్యం నుంచి ఇటీవలే పదవీ విరమణ పొందిన ఇతను, ఇంతటి సాహసానికి ఎందుకు పాల్పడ్డాడు అనే కోణంలో పోలీసులు మరింత లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



