
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు బాలముకుంద్ తరికెరె నారాయణ థాయ్లాండ్లో జరిగిన ప్రతిష్టాత్మక పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచారు. వరల్డ్ ఫిట్నెస్ ఫెడరేషన్ యోగాసన స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ (WFFYSI) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసియా-పసిఫిక్ అంతర్జాతీయ యోగాసన క్రీడల్లో ఆయన కాంస్య పతకంతో పాటు ట్రోఫీని కైవసం చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక అథ్లెట్గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆయన ఈ అరుదైన ఘనత సాధించారు.
ఈ నెల 7వ తేదీన థాయ్లాండ్లోని రాయాంగ్ వేదికగా ఉన్న స్టార్ కన్వెన్షన్లో ఈ యోగాసన పోటీలు అట్టహాసంగా జరిగాయి. మాస్టర్స్ విభాగంలో పాల్గొన్న బాలముకుంద్ అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను మెప్పించి పతకాన్ని ఖాయం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆతిథ్య థాయ్లాండ్తో పాటు భారతదేశం, శ్రీలంక, మలేషియా దేశాలకు చెందిన పలువురు ప్రముఖ యోగా క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు శివం భదౌరియా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, క్రీడాకారుల ఉత్సాహాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
గతంలోనూ పతకాల పంట
బాలముకుంద్ అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించడం ఇది తొలిసారి కాదు. గతంలో శ్రీలంక రాజధాని కొలంబోలో 2024 ఆగస్టులో జరిగిన ఆసియా-పసిఫిక్ యోగా పోటీల్లో ఆయన ఏకంగా స్వర్ణ పతకంతో పాటు ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 2025 అక్టోబర్ నెలలో మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన పోటీల్లోనూ తన సత్తా చాటి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా థాయ్లాండ్లో కాంస్యం సాధించడం పట్ల పలువురు క్రీడాభిమానులు, యోగా గురువులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



