
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ :దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) శుభవార్త చెప్పింది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ వేతన పరిమితిని భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రూ.15 వేల పరిమితిని ఏకంగా రూ.25 వేలకు పెంచుతున్నట్లు కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి.
51 లక్షల మందికి లబ్ధి
దాదాపు పుష్కర కాలం తర్వాత పీఎఫ్ వేతన పరిమితిని పెంచడం గమనార్హం. 2014లో చివరిసారిగా ఈ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15 వేలకు సవరించారు. అప్పటి నుంచి పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతన పరిమితిని కూడా పెంచాలని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తాజా నిర్ణయంతో సుమారు 51 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూర్చనుంది. ఈ పెంపు అమలు కోసం కేంద్రం ఏటా రూ.11,339 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది.
సామాజిక భద్రత మరింత విస్తృతం
ఇప్పటివరకు రూ.15 వేల లోపు వేతనం తీసుకునే వారు మాత్రమే పీఎఫ్ పరిధిలోకి తప్పనిసరిగా వచ్చే వారు. అంతకంటే ఎక్కువ వేతనం ఉన్నవారు యాజమాన్యంతో పరస్పర ఒప్పందం ద్వారా మాత్రమే పీఎఫ్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉండేది. దీనివల్ల చాలామంది ఉద్యోగులు ఈ సామాజిక భద్రతా పథకానికి దూరమవుతున్నారనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజా వేతన పరిమితి పెంపుతో మరింత మంది కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు పీఎఫ్ పరిధిలోకి రానున్నారు. తద్వారా వారు మెరుగైన సామాజిక భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలను పొందనున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



