
ముంబై, సూర్య న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాఠశాల నాటి స్నేహితుడు అస్గర్ అలీ వోరా దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న భూ వివాదానికి ఎట్టకేలకు ముగింపు లభించింది. ఆయన ఇటీవల మోదీని నేరుగా కలిసి తన సమస్యను విన్నవించిన కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రలోని (Maharashtra) మీరా-భయందర్ ప్రాంతంలో ఉన్న వివాదాస్పద స్థలం వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు.
గుజరాత్ రాష్ట్రం వడ్నగర్లోని బీఎన్ స్కూల్లో ప్రధానితో కలిసి చదువుకున్న 81 ఏళ్ల వోరా.. తన భూ సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ 8వ తేదీన ఆయనను కలిసి జోక్యం చేసుకోవాలని కోరారు. భయందర్ ఈస్ట్లోని నవ్ఘర్ ప్రాంతంలో 1989లో తాను కొనుగోలు చేసిన సుమారు 2,810 చదరపు మీటర్ల స్థలాన్ని కొన్ని నిర్మాణ సంస్థలు 2011 నుంచి ఆక్రమించుకున్నాయని ఆయన ఆరోపించారు. ఆ భూమిని తాను ఎవరికీ విక్రయించలేదని, గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ప్రధానితో సమావేశం అనంతరం స్థానిక యంత్రాంగం ఈ భూ వివాదంపై వేగంగా స్పందించింది. మంగళవారం సచివాలయంలో స్థానిక మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే మెహతా, వోరా సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివాదాస్పద స్థలంపై తనకున్న హక్కులను వదులుకుంటున్నట్లు ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా రాసివ్వడంతో పాటు, ఆ భూమిలో నిర్మాణ అనుమతులను ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ ఇచ్చారు. అలాగే వోరాపై గతంలో ఇచ్చిన పోలీసు ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



