
హైదరాబాద్, సూర్య న్యూస్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (Dr. BR Ambedkar Open University) పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం బుధవారం ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య శిబిరం (Free Medical Camp) నిర్వహించారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ (KIMS Sunshine Hospitals) సంయుక్త సహకారంతో యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ కరోనా మహమ్మారి తర్వాత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడిందని వివరించారు. యూనివర్సిటీ సిబ్బందిలో కూడా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో అందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ఆరోగ్య శిబిరంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయకృష్ణా రెడ్డి, వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని దేవరశెట్టి, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ చీఫ్ బిజినెస్ మేనేజర్ ఎం. శ్రీనివాస్, జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఎఫ్హెచ్పీఎల్ ప్రతినిధి యు. ప్రభాకర్ తదితర వైద్య బృందం సభ్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు అందజేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



