
Mahabalipuram, Surya News: కేంద్ర హోం మంత్రి (Union Home Minister Amit Shah) అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో (Southern Zonal Council Meeting) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను, అక్కడి ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర నమ్మకం, సమన్వయం ఉన్నప్పుడే వివాదాలు పరిష్కారమై సమిష్టి అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
దేశ మొత్తం జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా దాదాపు 31 శాతంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి దక్షిణాది రాష్ట్రాల సంయుక్త ఆర్థిక వ్యవస్థను 10 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని, వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణ భారత్ను ప్రధాన గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ ప్రయోజనం చేకూరేలా పలు కీలక ప్రతిపాదనలను ఆయన సభ ముందుంచారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిశ్రమల వేగవంతమైన వృద్ధి కోసం సమీకృత లాజిస్టిక్స్, డ్రై-పోర్ట్ నెట్వర్క్ను అనుసంధానించాలని సూచించారు. విద్యుత్ కొరతను అధిగమించడానికి పవర్ గ్రిడ్ కనెక్టివిటీని మరింత పటిష్టం చేయాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్రాలు పరస్పరం ఆదుకునేందుకు ఉమ్మడి మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు యూనివర్సిటీలు, నైపుణ్య శిక్షణ సంస్థల కన్సార్టియంను ఏర్పాటు చేయాలని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి దక్షిణ భారత వారసత్వ, ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ను తీర్చిదిద్దాలని కోరారు.

దక్షిణాది రాష్ట్రాల దీర్ఘకాలిక నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని పిలుపునిచ్చారు. సముద్రంలో కలిసే సుమారు 500 టీఎంసీల మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా ఇతర ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత లభిస్తుందని వివరించారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం వేగంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



