
అమరావతి, సూర్య న్యూస్: జనసేన పార్టీ (Janasena Party) తమ కార్యకర్తల నుంచి భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త నాయకత్వ ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలలో పైస్థాయిలో ఉండే లీడర్లు కింది స్థాయి నేతలను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ పద్ధతిని మార్చి కార్యకర్తల నుంచే నేతలు పుట్టుకురావాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా అసెంబ్లీ, పార్లమెంట్, మండల, గ్రామ స్థాయి నాయకత్వ బాధ్యతల కోసం జనసైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
రాజకీయాల్లో (Political Leaders) ఎదగాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఐదు రోజుల పాటు అప్లికేషన్లు స్వీకరిస్తారు. దీనికోసం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో మూడు రకాల డెస్కులు ఏర్పాటు చేశారు. అక్కడ మూడు రకాల అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు తమకు తగిన కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తుల పరిశీలన కోసం క్షేత్రస్థాయిలో 32 మందితో ఒక పరిశీలన కమిటీ (Screening Committee) ఏర్పాటు చేశారు. అప్లికేషన్ తీసుకున్నాక కార్యకర్తలు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఎలా పనిచేస్తారు అనే విషయాలతో పాటు వారి నాయకత్వ లక్షణాలపై స్క్రూటినీ చేస్తారు. అభ్యర్థుల నాయకత్వ లక్షణాలను పరిశీలించి వారికి తగిన శిక్షణ ఇస్తారు.
క్షేత్రస్థాయిలో నాయకులను నియమించడంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) స్పష్టం చేశారు. కార్యకర్తలే నేతలుగా ఎదిగితే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే ఆలోచనతో జనసేన ఈ కార్యాచరణ చేపట్టింది. ఈ సరికొత్త నిర్ణయంతో పార్టీ కోసం నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీగా జనసేన మారుతోంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



