
నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేజీఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో ఉన్న ఫర్నిచర్ షాపుల్లో రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫర్నిచర్ యూనిట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఘటనా స్థలికి బీఆర్ఎస్ శ్రేణులు
అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో సర్వం కోల్పోయిన వ్యాపారులను కలిసి వారు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ పరామర్శించిన వారిలో మాజీ డెప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రవికిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కష్టకాలంలో బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. అధికారులు తక్షణమే స్పందించి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.