Skip to content
Home » Radhika Sarathkumar : సీనియర్ నటి రాధికా మూవీ ఓటీటీ ఎంట్రీ.. ఆ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Radhika Sarathkumar : సీనియర్ నటి రాధికా మూవీ ఓటీటీ ఎంట్రీ.. ఆ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

హైదరాబాద్, సూర్య న్యూస్: వెండితెరపై దశాబ్దాల కాలంగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి రాధిక (Radhika Sarathkumar) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘థాయ్ కిళవి’ (Thai Kizhavi) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి (OTT Platform) అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. థియేటర్లలో సంచలన విజయం నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. మలి వయసులోనూ రాధిక తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.

ఈ చిత్రాన్ని తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) నిర్మించగా.. ఇందులో రాధిక నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా వృద్ధురాలిగా మంచానికే పరిమితమైన పాత్రలో ఆమె పండించిన హావాభావాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా నిర్మాత శివ కార్తికేయన్ లాభాల్లో రాధికకు వాటా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐఎండీబీ (IMDb) రేటింగ్‌లోనూ ఈ సినిమా 8.1 స్కోరుతో దూసుకుపోతోంది.

​కథా నేపథ్యం ఇదే:

ఈ చిత్రంలో రాధిక ముక్కుసూటి మనస్తత్వం గల ఒక బామ్మ పాత్రలో కనిపిస్తారు. ఊరిలో వడ్డీ వ్యాపారం చేస్తూ కఠినంగా వ్యవహరించే ఆమె.. బాధ్యత లేని తన ముగ్గురు కొడుకులను ఇంటి నుంచి గెంటేస్తుంది. అయితే ఆమె దగ్గర భారీగా బంగారు నిధి ఉందనే ప్రచారం ఊరిలో మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు పక్షవాతం (Paralysis) వచ్చి మాట పడిపోతుంది. నిధిపై ఆశతో కొడుకులు తిరిగి తల్లి వద్దకు చేరుకుంటారు. మాట రాని స్థితిలో ఉన్న బామ్మ వారికి సైగల ద్వారా ఏం చెప్పాలని ప్రయత్నించింది? చివరకు ఆ నిధి ఏమైంది? అనే ఉత్కంఠభరిత అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్‌లో (JioHotstar) ఏప్రిల్ 10, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.