
హైదరాబాద్, సూర్య న్యూస్ : ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ నిర్ణయం రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీకి అనుకూలంగా వాడుకోవడమేనని ఆయన మండిపడ్డారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ట్విట్టర్ (X) వేదికగా ఘాటుగా స్పందించారు.
ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి, మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అపహాస్యం చేయడమేనని కేటీఆర్ విమర్శించారు. స్పీకర్ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు ఈ అప్రజాస్వామిక చర్యలను గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై తమ పోరాటం ఆగదని, న్యాయస్థానాల్లో దీనిపై తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.