
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణలో మిగిలిన 3,797 మంది గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA)కు జీఓ నంబర్లు 81 మరియు 85 ప్రకారం ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కొనసాగుతోంది. ఈ ధర్నాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు.
పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి ధర్నా స్థలానికి వచ్చిన మల్లన్న, VRAలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “వేలాది కుటుంబాలు ఉద్యోగ భద్రత కోసం పోరాడుతుండగా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఇందిరా పార్క్లో జరుగుతున్న అనేక ధర్నాల్లో వెనుకబడిన వర్గాల వారే ఉండటం వల్లనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా?” అని ప్రశ్నించారు.
మిగిలిన 3,797 మంది VRAలను రెగ్యులరైజ్ చేసి నియామక పత్రాలు ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద పని కాదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పరిపాలనలో VRAల పాత్ర అత్యంత ముఖ్యమని గుర్తుచేస్తూ, ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ గ్రామాల్లో భూముల వివరాలు తెలుసుకోవాలంటే VRAల అవగాహనే కీలకమని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న వీరిని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి VRAలకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమస్య పరిష్కారానికి ఏమైనా అడ్డంకులు ఉంటే స్పష్టంగా చెప్పాలని సూచించారు. గత ప్రభుత్వంలాగే ఇప్పుడు కూడా సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు.
VRAల పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మల్లన్న స్పష్టం చేశారు. “మీ ఉద్యోగాలు వచ్చే వరకు నేను మీతోనే ఉంటాను. మీ బాధ నా బాధ. న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని ప్రకటించారు.

గతంలో ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో భూముల సమస్యపై ఇచ్చిన హామీని నెరవేర్చినట్లే, VRAలకు కూడా న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపారు. అవసరమైతే ఎంతవరకైనా వెళ్తానని, వెనక్కి తగ్గబోనని ఉద్ఘాటించారు.ఉద్యోగాల కోసం పోరాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న VRA కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో పాల్గొన్న VRAలు ప్లకార్డులు, బ్యానర్లతో తమ డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్న వీరికి తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ బలపడుతోంది.