Skip to content
Home » కవిత విమర్శలకు హైడ్రా కౌంటర్: ఆదిత్య బిల్డర్స్ వ్యవహారంలో వాస్తవాలు ఇవే!

కవిత విమర్శలకు హైడ్రా కౌంటర్: ఆదిత్య బిల్డర్స్ వ్యవహారంలో వాస్తవాలు ఇవే!

మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఆదిత్య బిల్డర్స్ చేపట్టిన నిర్మాణాలపై వస్తున్న అనుమానాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. నదీ గర్భంలోకి చొచ్చుకు వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారన్న సందేహాల నివృత్తి కోసం గండిపేట్ తహశీల్దార్‌కు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. శాటిలైట్ చిత్రాలను డెమ్ (DEM) నివేదికతో పోల్చి చూసినప్పుడు కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయని, దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అయితే రెవెన్యూ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలోనే అనుమతుల రద్దు

ఆదిత్య బిల్డర్స్‌కు గతంలో ఇచ్చిన నిర్మాణ అనుమతులను రద్దు చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని కమిషనర్ గుర్తు చేశారు. అనుమతుల రద్దుపై సదరు బిల్డర్ హైకోర్టును ఆశ్రయించారని, తాము బఫర్ జోన్‌కు వెలుపలే నిర్మాణాలు చేస్తున్నామని కోర్టుకు నివేదించారని తెలిపారు. దీనిపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే హైకోర్టు అనుమతులను పునరుద్ధరించిందని, ప్రస్తుతం ఆ మేరకే నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు.

కల్వకుంట్ల కవిత ఆరోపణలపై హైడ్రా ఖండన

వాస్తవాలు ఇలా ఉంటే, మాజీ ఎమ్మెల్సీ కవిత హైడ్రా పనితీరును తప్పుపడుతూ పదేపదే విమర్శలు చేయడాన్ని కమిషనర్ ఖండించారు. హైకోర్టు అనుమతులు ఇచ్చినప్పటికీ, మరోసారి పక్కాగా నిర్ధారించుకోవాలనే ఉద్దేశంతోనే తాము తహశీల్దార్‌కు లేఖ రాశామని ఆయన పేర్కొన్నారు. నదీ గర్భంలోకి ప్రహరీ గోడ జరిగి ఉందన్న అనుమానంతోనే వివరణ కోరామని, దీనిని తప్పుగా చిత్రించడం సరికాదని స్పష్టం చేశారు. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసినప్పటికీ, మళ్లీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజా వివరణ ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.