Skip to content
Home » బఫర్ జోన్ నిబంధనలు కేవలం పేదలకేనా?: రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు (Video)

బఫర్ జోన్ నిబంధనలు కేవలం పేదలకేనా?: రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు (Video)

హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మరియు బఫర్ జోన్ నిబంధనల అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నిబంధనలు కేవలం పేద మరియు మధ్యతరగతి ప్రజలకే వర్తిస్తాయా అని ఆయన నిలదీశారు. బఫర్ జోన్లు మరియు ఎఫ్టీఎల్ (FTL) పరిధులు సామాన్యుల ఇళ్లకే అడ్డు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గి మున్సిపాలిటీలో ఆయన సొంత ఇల్లు ‘రెడ్డికుంట’ అనే చెరువు మధ్యలో ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. అలాగే ముఖ్యమంత్రి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి ఇల్లు కూడా దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని, అయితే హైకోర్టు ఆర్డర్ పేరుతో దాన్ని ముట్టుకోవడం లేదని విమర్శించారు. అమీన్‌పూర్ చెరువు వద్ద హైకోర్టు ఆర్డర్లు ఉన్నా పేదల ఇళ్లను మెడ పట్టి బయటకు నెట్టి కూల్చివేసిన ప్రభుత్వం, తిరుపతి రెడ్డి విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన నిలదీశారు.

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి చెందిన గెస్ట్ హౌస్‌లు కూడా హిమాయత్ సాగర్ చెరువును పూడ్చి నిర్మించినవేనని కేటీఆర్ పేర్కొన్నారు. వీటికి బఫర్ జోన్ నిబంధనలు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్‌మెంట్లను కూల్చివేస్తూ, ఇప్పుడు మూసీ తీరాన కొత్తగా కడుతున్న అపార్ట్‌మెంట్లను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు వివేక్ వెంకట్ స్వామి, కేవీపీ రామచంద్రరావు వంటి ప్రముఖుల ఇళ్లు కూడా చెరువుల పరిధిలోనే ఉన్నాయని, ఏ అధికారి కూడా వారి జోలికి వెళ్లడం లేదని ఆయన మండిపడ్డారు. సహజ న్యాయ సూత్రాలు కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే వర్తించవన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందని కేటీఆర్ విమర్శించారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.