
రాజమహేంద్రవరం, సూర్య న్యూస్ : రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఆయన జరిపిన పర్యటనలో అధికారుల తీరుపై మండిపడ్డారు. పుష్కర ఘాట్ నుండి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణిస్తూ నదీ తీరంలోని కాలుష్యాన్ని, జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించిన పవన్ కల్యాణ్, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పుష్కరాల పనులకు సంబంధించి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో డీపీఆర్లు (DPRs), ప్రణాళికలు సిద్ధం కాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అధికారులు వాస్తవ పరిస్థితులను వివరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వంపై అపవాదు వస్తుందని పవన్ హెచ్చరించారు. ప్రణాళిక లేకుండా పనులు చేపడితే ప్రధానమంత్రి మోదీ నిధులు కూడా మంజూరు చేయరని ఆయన స్పష్టం చేశారు.
చినతల్లమ్మ ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలుస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం, వ్యర్థాలను వేరు చేసే పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే పనులు చేస్తే ఉపేక్షించేది లేదని అధికారులకు తేల్చి చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని ఆయన వెల్లడించారు.