
హైదరాబాద్, సూర్య న్యూస్ : మజ్లిస్ పార్టీ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి మాత్రమే మద్దతు ఇస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సైదాబాద్లో నూతనంగా నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో తాము బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చామని అసదుద్దీన్ గుర్తుచేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి దూకుడును అదుపు చేయకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని, ఇంటికి వెళ్లాల్సి వస్తుందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను తాను ముందుగానే హెచ్చరించానని ఆయన తెలిపారు. అయితే కేసీఆర్ తన మాట వినలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డిలో గతంలో ఉన్నంత దూకుడు కాస్త తగ్గిందని, ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చి చాలా మర్యాదపూర్వకంగా మారిపోయారని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని, జనం కచ్చితంగా ఆదరిస్తారని ముఖ్యమంత్రికి ఆయన ఈ సందర్భంగా సూచించారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎంఐఎం అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



