
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమెను బర్తరఫ్ చేయాలని కోరుతూ సీఎం కార్యాలయం నుంచి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు అధికారికంగా సిఫార్సు పంపారు. గవర్నర్ ఈ ఫైలుపై సంతకం చేసి ఆమోదం తెలిపిన వెంటనే ఈ ఆదేశాలు లాంఛనంగా అమల్లోకి రానున్నాయి.
అదేవిధంగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న జి. చిన్నారెడ్డి నియామకాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన స్థానంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చైర్పర్సన్గా మాజీ ఎంపీ జి. సుధారాణి నియామకాలకు కూడా ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భగ్గుమన్న సురేఖ
తనను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై కొండా సురేఖ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన నుంచి కనీస వివరణ కూడా తీసుకోకుండా ఏకపక్షంగా ఎలా బర్తరఫ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ పదవి నుంచి తప్పించడం సరికాదన్నారు. తన తొలగింపు నిర్ణయం చెల్లదని, దీనిపై తన భర్త కొండా మురళితో చర్చించి తదుపరి రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.
కుట్ర చేశారన్న ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి తనను బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తున్నారని కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను కేబినెట్ నుంచి తప్పించకపోతే తాను వెళ్లిపోతానని రేవంత్ పార్టీ అధిష్ఠానాన్ని బెదిరించినట్లు ఆమె ఆరోపించారు. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా తాను సీఎంను కలిసినప్పుడు ఈ తొలగింపు అంశం ఏదీ ప్రస్తావనకు రాలేదని, అధిష్ఠానానికి సైతం తనను తొలగించే ఉద్దేశం లేదని ఆమె పేర్కొన్నారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి పథకం ప్రకారమే తనపై కుట్ర చేశారని సురేఖ విమర్శించారు. కాగా, ఈ పరిణామాల మధ్య హైదరాబాద్లోని సురేఖ నివాసం వద్దకు అనుచరులు, మీడియా ప్రతినిధులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా కొండా మురళి.. అనుచరులతో మాట్లాడుతూ, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



