
హైదరాబాద్, సూర్య న్యూస్ : విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ నందన (YouTuber Nandana) అరెస్ట్ అయ్యారు. అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు (Shamshabad Airport) చేరుకున్న ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై అప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ చేరుకుని ఆమెను అరెస్ట్ చేశారు.
నందూస్ వరల్డ్ నుంచి డెస్టినీ కన్సల్టెన్సీ వరకు ‘నందూస్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నందన భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆ తర్వాత తన భర్త మధుకర్తో కలిసి ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ అనే ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేశారు. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు ప్రాసెస్ చేయిస్తామని నమ్మించి వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల వరకు వసూలు చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
అమెరికా నుంచి రాగానే దొరికిన నిందితురాలు బాధితుల ఫిర్యాదు మేరకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2025 నవంబర్ 22న నందనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు నమోదు కావడంతో నందన మరియు ఆమె భర్త అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో పోలీసులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా నందన అమెరికా నుంచి ఎమిరేట్స్ ఈకే-526 విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. పాస్పోర్ట్ తనిఖీ చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు గుర్తించి ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని నందనను అదుపులోకి తీసుకున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



