
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎయిడ్-డి-కాంప్గా (ADC) విశేష సేవలందించిన యువ అధికారి మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh) ఆర్మీ నుంచి ముందస్తు పదవీ విరమణ పొందారు. కేవలం 30 ఏళ్ల వయస్సులో, పన్నెండేళ్ల సుదీర్ఘ సైనిక ప్రస్థానానికి ఆయన వీడ్కోలు పలకడంపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు రాగా, తన కుటుంబ బాధ్యతలు చూసుకునేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని డోగ్రా రాజపుత్ర కుటుంబానికి చెందిన రిషభ్ జాతీయ రక్షణ అకాడమీ ద్వారా సైన్యంలో అడుగుపెట్టారు. కఠిన శిక్షణను పూర్తి చేసుకుని ప్రతిష్టాత్మక 4-పారా స్పెషల్ ఫోర్సెస్లో చేరి బలిదాన్ బ్యాడ్జ్ సాధించారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్లో జాట్ రెజిమెంట్కు నేతృత్వం వహించిన ఆయన పనితీరును గుర్తించి రాష్ట్రపతి వద్ద అధికారిక ప్రోటోకాల్, భద్రతా వ్యవహారాలు పర్యవేక్షించే అత్యంత నమ్మకమైన ఏడీసీగా నియమించారు. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన ఆయన, తన పదవీకాలం ముగిసిన తర్వాత ఆగస్టు 21న రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.
రాజీనామాపై వదంతులు.. వాస్తవం
ఏడీసీగా ఉన్నంత కాలం వివాహం చేసుకోకూడదనే నిబంధన ఉండటం వల్లే ఆయన రాజీనామా చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రిషభ్ తోసిపుచ్చారు. ఏడీసీగా ఉన్నప్పుడు పెళ్లికి అనుమతి లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండటం వంటివి వృత్తిలో భాగంగా తాను చేసిన త్యాగాలని, కానీ పదవీ విరమణకు అది ప్రధాన కారణం కాదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం తనకు వివాహం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వయసు పైబడుతున్న తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు చూసుకోవాలనే ఏకైక కారణంతోనే తన జీవితంలో ఈ అత్యంత కష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



