
లక్నో, సూర్య న్యూస్ : అమెజాన్ (Amazon)లో క్లౌడ్ ఇంజనీర్గా ఏడాదికి సుమారు రూ.46 లక్షల ప్యాకేజీతో పనిచేస్తున్న 27 ఏళ్ల శార్దేందు తివారీ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని భారత సైన్యంలో (Indian Army) చేరారు. బీహార్లోని గయా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన ఆయన శనివారం సైనిక అధికారిగా కమిషన్ అయ్యారు.
లక్నోలోని నీలమథా ప్రాంతానికి చెందిన శార్దేందు తివారీ కుటుంబం సుల్తాన్పూర్ జిల్లా పిపర్గావ్ గ్రామం నుంచి వచ్చినది. ఆయన తండ్రి రాజ్ కుమార్ తివారీ ఆర్మీ సర్వీస్ కార్ప్స్లో 36 ఏళ్లు పనిచేసి హానరరీ కెప్టెన్గా రిటైర్ అయ్యారు. తండ్రి సేవ నుంచి స్ఫూర్తి పొంది చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలని ఆయన బలంగా కోరుకున్నారు.
హర్యానాలోని చండీమందిర్ కేంద్రీయ విద్యాలయంలో చదువు పూర్తి చేసిన శార్దేందు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్ పూర్తి చేశారు. అమెజాన్లో క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సమయంలో గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థ ఎయిర్బస్ నుంచి కూడా ఆయనకు ఉద్యోగ అవకాశం వచ్చింది. అయినా దేశ సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో సైన్యంలో చేరే నిర్ణయాన్ని ఆయన మార్చుకోలేదు.
8 సార్లు విఫలమైనా వెనక్కి తగ్గలేదు
సైన్యంలో చేరేందుకు శార్దేందు తివారీ ఎనిమిది సార్లు సెలక్షన్ ప్రక్రియకు హాజరయ్యారు. ఏడు సార్లు విఫలమైన తర్వాత కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా ఎట్టకేలకు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఎనిమిదో ప్రయత్నంలో ఎంపికయ్యారు. గయా ఓటీఏలో శిక్షణ సమయంలో ఆయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి సీనియర్ అండర్ ఆఫీసర్ హోదా ఇచ్చారు. ఇది అకాడమీలో కేడెట్లకు లభించే అత్యున్నత నియామకాల్లో ఒకటి కావడం గమనార్హం. పట్టుదల, లక్ష్యం పట్ల నిబద్ధత వల్లే ఈ దశకు చేరుకున్నానని శార్దేందు పేర్కొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



