
ధిక్కార స్వరానికి బ్రేక్..??
కొండా సురేఖ బర్తరఫ్ తో మారిన సీన్..!
మునుగోడు/నల్లగొండ ( సూర్య న్యూస్ తెలుగు): నిన్నటి దాకా సొంత ప్రభుత్వంపై అసంతృప్తి సెగలు రాజేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా వెనక్కి తగ్గారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే ఆయన.. ఈరోజు నకిరేకల్లో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు హాజరవుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో కనగల్ లో జరిగిన సీఎం సభకు డుమ్మా కొట్టడమే కాకుండా, మునుగోడు నుంచి కనీసం జనసమీకరణ కూడా చేయని ఆయన వైఖరిలో ఒక్కసారిగా మార్పు రావడం ఆసక్తి రేపుతోంది.
“నేను సీఎం కావాలనుకుంటే ఎవరూ ఆపలేరు.. రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమే..” అంటూ మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో కలకలం రేపాయి. ఇతర పార్టీల నుంచి వస్తున్న వలసలపైనా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “పార్టీ బలోపేతానికి చేరికలు ఓకే కానీ.. మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని వెళ్లగొడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు” అంటూ కుండబద్దలు కొట్టారు. దీనికి తోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదంటూ సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి గళం విప్పారు.
అయితే, సీన్ కట్ చేస్తే.. మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ అధిష్టానం తీసుకున్న సంచలన నిర్ణయమే రాజగోపాల్ రెడ్డి యూటర్న్కు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గీత దాటితే వేటు తప్పదన్న హైకమాండ్ హెచ్చరికల నేపథ్యంలోనే ఆయన స్పీడ్ తగ్గించినట్లు తెలుస్తోంది. బహిరంగ విమర్శలతో అధిష్టానం ఆగ్రహానికి గురికావడం కంటే, సర్దుకుపోవడమే వ్యూహాత్మకంగా సరైనదని భావించిన రాజగోపాల్ రెడ్డి.. సీఎం సభకు హాజరవుతూ సయోధ్య మంత్రం పఠిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



