
అమరావతి, సూర్య న్యూస్ : ఏపీలో మెగా డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాల్లో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మరోసారి ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగించకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.
ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ జగన్ కర్నూలు జిల్లా ఉదంతాన్ని ఉదహరించారు. ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టీఈటీలో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు ఎలా ఇచ్చారని అడిగారు. ఒన్ టు ఒన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అర్హత లేదని తెలిసినా పోస్టు ఎలా ఇచ్చారని, దరఖాస్తు దశలోనే రిజెక్ట్ కావాల్సిన వ్యక్తి తర్వాతి దశలు దాటి ఉద్యోగం ఎలా పొందగలిగాడని ప్రశ్నించారు. అధికారుల చేత ఈ పని చేయించిన అదృశ్య శక్తి లోకేష్ కాదంటారా అని నిలదీశారు.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు ప్రాథమిక పాఠశాలలో స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీగా నియమితులైన ప్రభాకర్ విషయంలో టీఈటీ పేపర్–1ఏ అర్హత లేకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా విద్యాధికారి విచారణలో లోపం నిర్ధారణ అయిందని, సంబంధిత అభ్యర్థిపై చర్యలు సిఫారసు చేశారని స్థానిక నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని ఆరోపించారు.
మెగా డీఎస్సీలో పేపర్ లీక్ నుంచి స్పోర్ట్స్ కోటా, టీఈటీ అర్హతల నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ స్కాంకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ప్రభుత్వం ఇంతకు ముందు స్పోర్ట్స్ కోటా నియామకాలు పారదర్శకంగా జరిగాయని, నిబంధనల ప్రకారమే ఎంపిక జరిగిందని స్పష్టం చేసింది. మంత్రి లోకేష్ అసెంబ్లీలోనే చర్చకు సిద్ధమని సవాలు విసిరిన విషయం తెలిసిందే.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



