
వాషింగ్టన్, సూర్య న్యూస్ డెస్క్ : సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping) అమెరికాలో అధికారిక పర్యటన చేయనున్నారు. 2015 తర్వాత ఓ చైనా అధ్యక్షుడు వైట్హౌస్కు స్టేట్ విజిట్కు రావడం మళ్లీ ఇదే తొలిసారి. కాగా, ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అరుదైన దౌత్య మర్యాదను ప్రదర్శించనున్నారు. సాధారణంగా విదేశీ అధినేతలకు వైట్హౌస్లో మాత్రమే స్వాగతం పలికే అమెరికా అధ్యక్షుడు.. ఈసారి దానికి భిన్నంగా వాషింగ్టన్ సమీపంలోని ‘జాయింట్ బేస్ ఆండ్రూస్’ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి జిన్పింగ్కు స్వాగతం పలకనున్నారు.
వైట్హౌస్లో స్టేట్ డిన్నర్.. టెక్ దిగ్గజాలకు ఆహ్వానం
సెప్టెంబర్ 24న వైట్హౌస్లో ఇరు దేశాల అధినేతల మధ్య ప్రధాన ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. వాణిజ్య ఒప్పందాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రేర్ ఎర్త్స్, తైవాన్ వంటి కీలక అంశాలపై ట్రంప్, జిన్పింగ్ చర్చించనున్నారు. అనంతరం జిన్పింగ్, పెంగ్ లియువాన్ దంపతుల కోసం వైట్హౌస్లోని ఈస్ట్ రూమ్లో ట్రంప్, మెలానియా దంపతులు ప్రత్యేక స్టేట్ డిన్నర్ హోస్ట్ చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక విందుకు సుందర్ పిచాయ్, ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, సామ్ ఆల్ట్మన్, టిమ్ కుక్, జెన్సెన్ హువాంగ్ వంటి అమెరికా టాప్ టెక్ సీఈఓలకు ఆహ్వానం అందింది.
టారిఫ్లపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
చైనాపై ఎప్పుడూ కఠినంగా వ్యవహరించే ట్రంప్.. జిన్పింగ్ పర్యటన నేపథ్యంలో సుంకాల (టారిఫ్లు) విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చైనాపై 145 శాతం వరకు టారిఫ్లు పెంచిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. అది చాలా ఎక్కువని, దానివల్ల వారికి తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. తాను వాళ్లకు ఆ స్థాయిలో నష్టం చేయాలని అనుకోలేదంటూ వ్యాఖ్యానించారు. చైనా పట్ల ట్రంప్ తన కఠిన వైఖరిని సడలించడం, స్వయంగా వెళ్లి స్వాగతం పలకడానికి సిద్ధపడటం ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



