
కాకినాడ, సూర్య న్యూస్ : కాకినాడ యాంకరేజ్ పోర్టు (Kakinada Anchorage Port) కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం (PDS Rice) అక్రమ ఎగుమతుల బాగోతం మరోసారి బయటపడింది. జిల్లా పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు శనివారం జరిపిన ఆకస్మిక దాడుల్లో సుమారు 65 లక్షల రూపాయల విలువైన 140 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమ రవాణాకు వినియోగిస్తున్న ఐదు లారీలను అధికారులు సీజ్ చేశారు.
పోషకాల గుర్తింపుతో రట్టయిన గుట్టు
జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎం. దేవుల నాయక్ నేతృత్వంలోని పోలీసు, రెవెన్యూ, సాంకేతిక బృందాలు పోర్టులో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో పట్టుబడిన లారీల్లోని కన్సైన్మెంట్లను పరిశీలించగా అందులో ఫోర్టిఫైడ్ రైస్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో మాత్రమే ఈ పోషకాల కెర్నల్స్ను కలుపుతారు. దీని ఆధారంగానే ఈ బియ్యం పీడీఎస్ సరుకుగా అధికారులు పక్కాగా గుర్తించారు.
వివిధ మిల్లుల నుంచి పోర్టుకు చేరిక
ఈ రేషన్ బియ్యాన్ని పలు రైస్ మిల్లుల నుంచి కాకినాడ పోర్టుకు తరలించినట్లు విచారణలో తేలింది. సీజ్ చేసిన లారీల్లో గదలకు చెందిన గోల్డెన్ అగ్రోస్ నుంచి 35 టన్నులు, గురుదత్త రైస్ నుంచి 30 టన్నులు, జగ్గంపేటకు చెందిన శ్రీ బాలాజీ బాయిల్డ్ అండ్ రా రైస్ మిల్ నుంచి 25 టన్నులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన అగ్రోస్ నుంచి 25 టన్నులు, మొత్తుకూరుకు చెందిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లుల నుంచి 25 టన్నుల సరుకు వచ్చినట్లు నిర్ధారించారు. రేషన్ దుకాణాల నుంచి దళారులు, మిల్లర్ల చేతులు మారుతూ ఈ బియ్యం ఎగుమతిదారులకు చేరుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏజెంట్లు, మిల్లర్లపై కఠిన చర్యలు
ప్రభుత్వం పేదలకు రెండు రూపాయలకు కిలో చొప్పున అందిస్తున్న బియ్యాన్ని మాఫియా అక్రమంగా సేకరించి ఆఫ్రికా వంటి దేశాలకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. కాకినాడ పోర్టు అక్రమ రవాణాకు అడ్డాగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో గతంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఇక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో స్టెల్లా ఎల్ పనామా అనే నౌకను సీజ్ చేయాలని ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా పట్టుబడిన వ్యవహారంలో ఎగుమతి హ్యాండ్లింగ్ ఏజెంట్లు, మిల్లర్లపై ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ సెక్షన్ 6(ఎ) కింద కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా ఇకముందు పోర్టు చెక్పోస్టులు, మిల్లులపై నిఘా మరింత కఠినం చేస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



