
నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కేజీఆర్ కన్వెన్షన్ సమీపంలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో పలు ఫర్నిచర్ షాపులు పూర్తిగా దగ్ధమవడంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మరియు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ నేడు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు మనోధైర్యాన్ని కల్పించారు.
ఘటనా స్థలిని పరిశీలించిన నేతలు
నిన్న రాత్రి 11 గంటల సమయంలో ప్రగతి నగర్ లోని ఫర్నిచర్ యూనిట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆస్తి మొత్తం బూడిదయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వెంటనే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దగ్ధమైన దుకాణాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ పర్యటనలో నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ డెప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎక్స్ కార్పొరేటర్ రవికిరణ్, సాంబశివ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ: “చిరు వ్యాపారులు కోట్లాది రూపాయల ఆస్తిని కోల్పోవడం అత్యంత బాధాకరం, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అవసరమైన వసతులు కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలి” అని కోరారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ: బాధితులకు తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, తగిన పరిహారం అందేలా అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు నిజాంపేట్ కార్పొరేషన్ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.