
విజయవాడ, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) క్వాలిఫై మార్కుల విషయంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు (In-Service Teachers) ఆందోళన బాట పట్టారు. అందరికీ ఒకే అర్హత మార్కులు ఉండాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆగస్టు 26వ తేదీ నుంచి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) ఆధ్వర్యంలో మొదలైన బైక్ ర్యాలీలు మరియు ధర్నాలు ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి.
కొత్తగా ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులకు విధించే అర్హత ప్రమాణాలను సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితం విధుల్లో చేరిన ఉపాధ్యాయులపై రుద్దడం దారుణమని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విద్యా హక్కు చట్టం అమలుకు ముందు నియమితులైన వారు కచ్చితంగా టెట్ పాస్ కావాల్సి ఉంది. ఏపీలో ఇలాంటి ఉపాధ్యాయులు సుమారు 72 వేల మందికి పైగా ఉన్నారు. వీరందరికీ ఒకే అర్హత మార్కులు అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం టెట్ లో ఓసీలకు 60 శాతం బీసీలకు 50 శాతం ఎస్సీ ఎస్టీలకు 40 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. దీనిని సర్వీస్ టీచర్లకు కూడా యథావిధిగా వర్తింపజేయడం సరికాదని యూటీఎఫ్ నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు కేఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వానికి సూచించారు. అలాగే గణితం మరియు సైన్స్ ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టులలోనే పరీక్ష నిర్వహించాలని వారు కోరుతున్నారు. మిగిలిన సబ్జెక్టుల వారికి వారి ప్రధాన సబ్జెక్టులలో 60 మార్కుల ప్రశ్నలు వస్తుండగా గణితం మరియు సైన్స్ వారికి మాత్రం కేవలం 20 మార్కుల ప్రశ్నలే వస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఎన్సీటీఈ అనుమతి సాధించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి యూటీఎఫ్ పిలుపునిచ్చింది. అప్పటికీ విద్యాశాఖ మంత్రి స్పందించకపోతే సెప్టెంబర్ 4 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ 11 నుంచి 21 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



