
హైదరాబాద్, సూర్య న్యూస్ :రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఒక తీపి కబురు అందించింది. టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) లో ఖాళీగా ఉన్న 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను నేరుగా ఆర్టీసీ యాజమాన్యమే చేపట్టనుంది. ప్రభుత్వ అనుమతి లభించడంతో నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
పదో తరగతి అర్హత (10th Class Eligibility) :
ఈ కండక్టర్ ఉద్యోగాలకు పదో తరగతి (SSC) అర్హతగా నిర్ణయించినట్లు సమాచారం. టెన్త్ క్లాస్ లో సాధించిన మార్కుల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుని, రోస్టర్ విధానం మరియు రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో నేరుగా కండక్టర్ (Conductor) పోస్టులను భర్తీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఏటా ఉద్యోగుల పదవీ విరమణతో పెరిగిన ఖాళీలను భర్తీ చేసేందుకు గతంలో తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించుకున్నారు. కానీ ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన భర్తీకి ప్రభుత్వం మొగ్గు చూపింది.
మార్కులు వర్సెస్ గ్రేడింగ్ (Marks vs Grading) :
ఈ నోటిఫికేషన్ జారీకి సంబంధించి ప్రస్తుతం ఒక సాంకేతిక సమస్య ఎదురవుతోంది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం టెన్త్ మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, గడిచిన కొన్నేళ్లలో విద్యాశాఖ గ్రేడింగ్ విధానాన్ని (GPA) అమలు చేసింది. ఆపై మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడ్ పాయింట్లు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు విధానాల మధ్య సమతుల్యత సాధిస్తూ, గ్రేడింగ్ లను మార్కుల శాతంగా ఎలా లెక్కించాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ఎస్ఎస్సీ బోర్డుకు లేఖ రాసింది.
త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ (Official Notification) :
ఎస్ఎస్సీ బోర్డు నుండి మార్కుల లెక్కింపుపై స్పష్టత వచ్చిన వెంటనే 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. చాలా కాలంగా ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఒక సువర్ణావకాశంగా మారనుంది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




