
హైదరాబాద్, సూర్య న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్కు (Bandi Bhagirath) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) భారీ ఊరట లభించింది. పోక్సో కేసులో (POCSO Case) అరెస్టై రిమాండ్లో ఉన్న ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని న్యాయస్థానం సూచించింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో (Petbasheerabad PS) విచారణ నిమిత్తం హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ భగీరథ్ ఒక విద్యార్థి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 45 రోజులకు పైగా జైలులో ఉండటం వల్ల జీవితంలో విలువైన సమయం కోల్పోయాడని తెలిపారు. పరస్పర అంగీకారంతో జరిగిన దానిపై కేసులు నమోదు చేయడం చెల్లదని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ఉదహరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ దర్యాప్తు దాదాపు పూర్తయిందని కోర్టుకు నివేదించారు. త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
మే 16న పోలీసులు భగీరథ్ను పోక్సో కేసులో అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు మే 20న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు ముగియడంతో జూన్ 25న తిరిగి జైలుకు వెళ్లారు. ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం సానుకూలంగా స్పందించి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




