ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన ఓబీసీ జాతీయ సదస్సులో కేంద్రానికి మేధావులు, రాజకీయ నేతల అల్టిమేటం. శాస్త్రీయంగా జనగణన చేపట్టకపోతే రూ. 12,800 కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని హెచ్చరిక.

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ జనగణనలో (National Census) కులగణనను తప్పనిసరిగా చేర్చాలని, అలాగే ప్రతి కులానికి ప్రత్యేకంగా ఒక ‘యూనిక్ కోడ్’ (Unique Code) కేటాయించాలని పలువురు మేధావులు, రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ‘జనగణనలో కులగణన – ప్రతి కులానికి యూనిక్ కోడ్’ అనే ప్రధాన ఎజెండాతో ఓబీసీ జాతీయ సదస్సు జరిగింది. ఈ అంశంపై దేశవ్యాప్త ఏకాభిప్రాయం కుదిరే వరకు జనగణన ప్రక్రియను నిలిపివేయాలని వారు స్పష్టం చేశారు.
బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి. కిరణ్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో రాజ్యసభ సభ్యులు విల్సన్, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఏఐసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ అనిల్ జైహింద్, స్వరాజ్ ఇండియా నేత ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ రతన్ లాల్, ప్రొఫెసర్ సూరజ్ మండల్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొని బాలరాజ్ గౌడ్, ఎస్. దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కులానికి ప్రత్యేక కోడ్ ఇవ్వకుండా కేవలం సాధారణ పద్ధతిలో జనగణన నిర్వహించడం ఏమాత్రం శాస్త్రీయంగా ఉండదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించినట్లుగానే ఓబీసీ మరియు జనరల్ కేటగిరీలకు కూడా విడివిడిగా ప్రత్యేక కాలమ్లను ఏర్పాటు చేయాలని కోరారు. డ్రాప్డౌన్ మెనూ ద్వారా ప్రతి కులానికి ఒక కోడ్ కనిపించేలా సాంకేతిక ఏర్పాట్లు చేసిన తర్వాతే జనగణన ప్రక్రియను మొదలుపెట్టాలని స్పష్టం చేశారు.
శాస్త్రీయమైన ప్రణాళిక లేకుండా మొక్కుబడిగా జనగణన చేపడితే కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న సుమారు రూ. 12,800 కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని డాక్టర్ సూరజ్ మండల్, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఎంపీ విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కులాన్ని కచ్చితంగా లెక్కించేలా పారదర్శకమైన విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. ఓబీసీల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా ముందుకు వెళితే, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని నేతలు హెచ్చరించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



