
ఢిల్లీ, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థలోని లోపాలు, నిరుద్యోగం, పేపర్ లీకేజీల (Paper Leaks) వంటి సమస్యలపై విద్యార్థులు, యువత గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.
యూపీ, ఎంపీల్లోనే అత్యధికం
మూతపడిన ప్రభుత్వ బడులలో 55 శాతం కేవలం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అలాగే దేశంలో విద్యార్థులకు హాస్టళ్ల సమస్య కూడా తీవ్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వంద మంది విద్యార్థులు ఉంటే అందులో కేవలం 14 మందికి మాత్రమే హాస్టల్ సీట్లు దొరుకుతున్నాయని, మిగతా వారి పరిస్థితి దారుణంగా మారిందని ఆయన విమర్శించారు.
దేశం ఇద్దరి గుప్పిట్లోకి వెళ్లింది
పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న దుస్థితి, నిరుద్యోగం తదితర అంశాలపై యువత ప్రశ్నించడాన్ని పాలకుల్లో కొందరు ఏమాత్రం సహించడం లేదని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు అస్సలు ప్రశ్నించవద్దని కోరుకునే ఇద్దరు వ్యక్తులు దేశాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారని రాహుల్ పరోక్ష విమర్శలు చేశారు. తమ భవిష్యత్తు కోసం విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



