
పరిగి, సూర్య న్యూస్: వికారాబాద్ జిల్లా (Vikarabad District) పరిగి మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ (Industrial Corridor) పేరుతో సాగుతున్న భూసేకరణ చిచ్చు రేపింది. రైతుల సారవంతమైన భూములను బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కల్లాపూర్, రాపోల్, భట్ల చందారం గ్రామాల్లోని దాదాపు 1250 ఎకరాల అసైన్డ్ భూముల సేకరణను నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం పరిగి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వందలాది మంది రైతులతో కలిసి ఆమె రోడ్డుపై బైఠాయించారు.
ఈ సందర్భంగా కవిత కలెక్టర్తో (Vikarabad Collector) ఫోన్లో మాట్లాడి భూసేకరణ నోటిఫికేషన్ (Land Acquisition Notification) తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరని, స్వయంగా వచ్చి వారి ఆవేదన వినాలని సవాల్ విసిరారు. అధికారుల నుంచి సరైన హామీ లభించకపోవడంతో ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు, కార్యకర్తలు ధర్నా కొనసాగించారు.
మీడియాపై పోలీసుల దాడి:
బందోబస్తులో ఉన్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడమే కాకుండా జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వార్తను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల కెమెరాలను లాక్కొని, లెన్స్కు చేతులు అడ్డుపెట్టి అరాచకం సృష్టించారు. జర్నలిస్టులను నెట్టేస్తూ దృశ్యాలు రికార్డ్ కాకుండా అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
కవిత అరెస్టు – తోపులాట:
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు కవితను బలవంతంగా అరెస్టు చేశారు. ఆమెను వాహనం నుంచి కిందకు దించి ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు, పోలీసుల మధ్య భారీ తోపులాట జరిగింది. అనంతరం కవితను బంటారం పోలీస్ స్టేషన్కు (Bantaram PS) తరలించారు. ముసీ నది (Musi River) పరీవాహక ప్రాంతంలో ఫార్మా పరిశ్రమలు (Pharma Industries) వస్తే కాలుష్యం పెరిగి బతుకులు చిన్నాభిన్నం అవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్ వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించారు.