Skip to content
Home » CM Revanth Reddy : జూన్ 12న స్కూల్స్ ఓపెనింగ్.. విద్యార్థులకు ప్రభుత్వం బిగ్ సర్ ప్రైజ్.. ఆ రోజే కీలక ఘట్టం

CM Revanth Reddy : జూన్ 12న స్కూల్స్ ఓపెనింగ్.. విద్యార్థులకు ప్రభుత్వం బిగ్ సర్ ప్రైజ్.. ఆ రోజే కీలక ఘట్టం

​హైదరాబాద్, సూర్య న్యూస్:రాష్ట్రంలో జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల ప్రారంభోత్సవం రోజున విద్యార్థులకు ఉచిత కిట్లను పంపిణీ చేయడంతో పాటు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

గవర్నర్ కు మర్యాదపూర్వక ఆహ్వానం

ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ (Governor) శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఆయన, ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న నూతన విధానాలను వివరించారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే విద్యార్థులకు అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందజేయనున్నట్లు తెలిపారు.

స్టూడెంట్స్ కిట్ లో ఏమేమి ఉంటాయంటే

ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఈ కిట్లలో విద్యార్థులకు అవసరమైన అన్ని సామాగ్రిని పొందుపరిచారు. ప్రధానంగా యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్త‌కాలు, స్కూల్‌ బ్యాగ్‌ (School Bag), క్రీడా దుస్తులతో పాటు ఇతర అవసరమైన వస్తువులు ఈ కిట్ లో ఉండనున్నాయి. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు గవర్నర్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

డ్రగ్స్ రహిత సమాజం కోసం భారీ ప్రణాళిక

విద్యార్థులు పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాల (Drugs) బారిన పడకుండా పాఠశాలల ప్రారంభం రోజునే వారితో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఆయా పాఠ‌శాల‌లు మరియు క‌ళాశాల‌ల్లో విద్యార్థులు వ్య‌స‌నాలకు బానిసలు కాకుండా అప్ర‌మ‌త్తంగా ఉండేలా యాజ‌మాన్యాలు కఠిన చర్యలు తీసుకుంటామని ప్ర‌క‌టించనున్నాయి. పాఠశాల విద్యాశాఖ (School Education Department), పోలీసు శాఖ మరియు ఈగ‌ల్‌ (EAGLE) సంస్థల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ సామూహిక ప్ర‌తిజ్ఞ‌, ఇత‌ర కార్య‌క్ర‌మాలు జరగనున్నాయి.

​అందరి సమష్టి బాధ్యత

విద్యా సంస్థ‌ల‌ను పూర్తిగా సుర‌క్షితంగా మరియు డ్ర‌గ్స్ ర‌హితంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని గవర్నర్ కు ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజ‌మాన్యాల సమ‌ష్టి బాధ్యత ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.