
విశాఖపట్నం, సూర్య న్యూస్ : విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి పక్క రాష్ట్రంలో పడేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కంచరపాలెం దుర్గానగర్కు చెందిన బొలిశెట్టి సురేష్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. సురేష్ భార్య గర్భవతి కావడంతో ఆమెకు సహాయంగా ఉండేందుకు తనకు తెలిసిన ఒక యువతిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ యువతి వారితో పాటే ఇంట్లో ఉండేది. ఇదే క్రమంలో సురేష్ ఆమెతో వివాహేతర బంధం (Extramarital affair) ఏర్పరుచుకున్నాడు.
కొద్ది రోజుల క్రితం సురేష్ భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో సదరు యువతి తనను పెళ్లి చేసుకోవాలని సురేష్పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన సురేష్ ఆ యువతి గొంతు నులిమి కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఆధారాలు మాయం చేసేందుకు మృతదేహాన్ని ఒక సూట్కేస్లో కుక్కాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ సూట్కేస్ను రైలులో ఒడిశా (Odisha) తీసుకువెళ్లాడు. రాయగడ జిల్లా పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.
నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న సూట్కేస్ను స్థానికులు గమనించారు. వెంటనే వారు పోలీసులకు (Police) సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఒడిశా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఈ హత్యకు సంబంధించిన లింకులు విశాఖపట్నానికి ముడిపడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే విశాఖ చేరుకున్న ఒడిశా పోలీసులు కంచరపాలెంలో ఉంటున్న నిందితుడు బొలిశెట్టి సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు మరింత విచారణ జరుపుతున్నారు.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




