
కూకట్పల్లి, సూర్య న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్లో కూకట్పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు (World Photography Day) అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు ముఖ్య నేతృత్వం వహించారు.
ప్రజల సమస్యలను, సమాజంలోని వాస్తవ పరిస్థితులను తమ కెమెరా కళ్లతో ప్రతిబింబిస్తూ విశేష సేవలందిస్తున్న నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్, ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ మాచర్ల నాగేశ్వరరావులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి వారికి ప్రత్యేక అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎర్ర యాకయ్య మాట్లాడుతూ ఒక చిత్రం కోట్ల మాటలు మాట్లాడుతుందని, వేల ప్రశ్నలను సంధిస్తూ లక్షల సమాధానాలకు సమానంగా నిలుస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పుట్టి నగేష్, కమిటీ సభ్యులు సుజాత, అనిల్ కిషోర్, శివతో పాటు పలువురు స్థానిక పాత్రికేయులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



