
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు చాకలి ఐలమ్మ (Chakali Ailamma). ఆమె వర్ధంతి, జయంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అధికారికంగా నిర్వహించింది . ఐలమ్మను గుర్తుచేసుకోవడం అంటే కేవలం పూలమాలలు వేసి నివాళులు అర్పించడం కాదు, భూమి కోసం, శ్రమ కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన తిరుగుబాటును స్మరించుకోవడం.
1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు ఆమె జన్మించారు. రజక కుటుంబంలో పుట్టిన ఆమె అసలు పేరు చిట్యాల ఐలమ్మ. పదకొండేళ్ల వయసులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఆమె వివాహం జరిగింది. ఐదుగురు కుమారులు, ఒక కుమార్తెతో కూడిన పెద్ద కుటుంబాన్ని పోషించడం కులవృత్తితో సాధ్యం కాలేదు. దీంతో పాలకుర్తి సమీపంలోని మల్లంపల్లి మక్థేదారు వద్ద సుమారు నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు.
ఆత్మగౌరవంపై దొరల దాడి
ఒక రజక మహిళ స్వతంత్రంగా వ్యవసాయం చేయడం నాటి విస్నూరు దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి సహించలేకపోయాడు. వేల ఎకరాలు, పదుల గ్రామాలు తన చెప్పుచేతల్లో ఉంచుకున్న ఆ దొర, ఐలమ్మను వెట్టి చాకిరి చేయాలని ఒత్తిడి చేశాడు. ఆమె కౌలుకు తీసుకున్న భూమిలో పండిన పంటను వదులుకోవాలని బెదిరించాడు. దొరల అహంకారాన్ని ఎదిరించిన ఐలమ్మ ఏమాత్రం భయపడకుండా ఆంధ్రమహాసభలో చేరి దొరకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది.
గూండాల ఎదిరింపు
1945 చివరి నుంచి 1946 మధ్య కాలంలో దొర తన వందమంది గూండాలను, మరో వందమంది పనివాళ్లను ఐలమ్మ పంటను కోసుకురావడానికి పంపాడు. ఆమె వెంటనే సంఘం సహాయం కోరింది. ఇరవై ఎనిమిది మంది స్వయంసేవకులు లాఠీలు చేతబట్టి గూండాలను తరిమికొట్టి పంటను సురక్షితంగా ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఈ సంఘటనను తెలంగాణ రైతాంగ తిరుగుబాటుకు మంట పెట్టిన అగ్నికణంగా ప్రముఖ కమ్యూనిస్ట్ నేత పి. సుందరయ్య తన పుస్తకంలో వర్ణించారు.
పాలకుర్తిలో రగిలిన జ్వాల
దొర ప్రతీకారంతో రగిలిపోయి ఐలమ్మ ఇంటిని తగులబెట్టించాడు. ధాన్యం, పశువులను లాక్కెళ్లడమే కాకుండా ఆమె భర్త, కుమారులను జైలుకు పంపాడు. కుటుంబంపై దొర అమానుషంగా హింసకు పాల్పడినా ఐలమ్మ ఎర్రజెండాను వదలలేదు. “ఈ భూమి నాది. పండించిన పంట నాది. నా ప్రాణం పోయాకే మీరు దీన్ని తీసుకెళ్తారు” అని ఆమె గర్జించిన తీరు పల్లెపల్లెనా పోరాట స్ఫూర్తిని రగిలించింది. దొడ్డి కొమరయ్య వీరమరణం, వందల గ్రామాల్లో భూపంపిణీ వంటి పరిణామాలకు ఆమె పోరాటమే పునాది వేసింది.
తరతరాలకు స్ఫూర్తి
1985 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో ఆమె కన్నుమూశారు. దశాబ్దాల తరబడి ఆమె పేరు చరిత్ర పుటల్లో మరుగున పడిపోయినా, నేడు విగ్రహాలు, విశ్వవిద్యాలయాలకు ఆమె పేరు పెట్టడం ద్వారా గౌరవం దక్కుతోంది. భూమి హక్కులు, వెట్టి రూపాలు మారి నేటికీ మిగిలే ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాలు భూమిపై, ఆత్మగౌరవంపై చేస్తున్న పోరాటాలకు ఐలమ్మ స్ఫూర్తి నేటికీ సజీవంగా ఉంది. చాకలి ఐలమ్మ కేవలం ఒక విగ్రహం కాదు, అన్యాయంపై ఎత్తిన పిడికిలికి నిలువెత్తు నిదర్శనం.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



