
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేరళలోని ప్రసిద్ధ శ్రీరామక్షేత్రం త్రిప్రయార్ శ్రీరామస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయుర్వేద వైద్యం కోసం ప్రస్తుతం కేరళలో ఉన్న ఆయన, శుక్రవారం సాయంత్రం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలంబలం యాత్రలో ఎంతో విశిష్టత ఉన్న ఈ ఆలయంలో పవన్ కళ్యాణ్కు ఆలయ నిర్వాహకులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు.
శ్రీరాముడికి ప్రత్యేక సేవలు
ఆలయంలోని దీపారాధనను అత్యంత విశిష్టమైన సేవగా భావిస్తారు. ఈ సేవలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఒకరోజు దీపారాధనకు అవసరమైన విరాళాన్ని స్వయంగా సమర్పించారు. శ్రీకృష్ణ మందిరం ఎదురుగా ఉన్న ప్రధాన దీపాల్లో ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. శంఖుచక్రాలు, ధనుస్సు, బాణాలను ధరించిన శ్రీరామస్వామి వారి మూలవిరాట్టును దర్శించుకుని సంధ్యాకాల అర్చనలు పూర్తి చేశారు. అనంతరం ప్రాంగణంలోని శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామిలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. గర్భాలయంలోని దక్షిణామూర్తి, వినాయకుడు, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపానికి కూడా ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
చేపలకు ఆహారం, బాణసంచా సేవ
శ్రీరామ దర్శనానికి ముందు శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్, మీనుట్టు సేవలో పాల్గొన్నారు. తీర్పా నదిలో చేపలకు ఆహారం అందించే ఈ సంప్రదాయాన్ని విష్ణుమూర్తికి ఆహారం సమర్పించినట్లుగా భక్తులు భావిస్తారు. ఆ తర్వాత వేడి వజిపాడు సేవలో భాగంగా బాణసంచా పేల్చే కార్యక్రమంలో ఆయన పాలుపంచుకున్నారు. ఈ సేవ నిమిత్తం 1,001 టపాసులు పేల్చేందుకు అయ్యే ఖర్చును పవన్ కళ్యాణ్ విరాళంగా అందజేశారు. ద్వాపర యుగం నాటి ఈ క్షేత్రంలో ఉన్న శ్రీరామ విగ్రహం సాక్షాత్తూ శ్రీకృష్ణుడి చేత పూజలందుకుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్శనలో పవన్ కళ్యాణ్ భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



