
ముంబై, సూర్య న్యూస్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (Director Ram Gopal Varma)కు సెట్స్పైనే ఊహించని బ్రేక్ పడింది. దాదాపు దశాబ్దం కాలం నాటి పారితోషికాల పంచాయితీ తెరపైకి రావడంతో, ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంపెనీ’ (Police Company Movie) చిత్రీకరణను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్ (FWICE) ప్రతినిధులు అర్ధాంతరంగా అడ్డుకున్నారు. నిలిచిపోయిన షూటింగ్ను తిరిగి పట్టాలెక్కించే క్రమంలో వర్మ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఏకంగా రూ. 1.11 కోట్ల బకాయిలను సెటిల్ చేయడంతో సమస్య సద్దుమణిగింది.
సుమారు తొమ్మిదేళ్ల క్రితం వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలకు సంబంధించి సాంకేతిక నిపుణులు, కార్మికులకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్లు పెండింగ్లో ఉన్నాయని ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బకాయిలను పూర్తిగా క్లియర్ చేసేవరకు ప్రస్తుత చిత్ర షూటింగ్ను కొనసాగనిచ్చేది లేదని తేల్చిచెప్పడంతో సెట్స్పై చిత్రీకరణ కొన్ని గంటల పాటు నిలిచిపోయింది.
పరిస్థితి తీవ్రతను గ్రహించిన వర్మ వెంటనే రంగంలోకి దిగి బాధితులకు చెల్లించాల్సిన రూ. 1.11 కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు అంగీకరించారు. దీంతో ఫెడరేషన్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయడంతో వివాదం సుహృద్భావ వాతావరణంలో ముగిసింది. బకాయిల క్లియరెన్స్ అనంతరం ‘పోలీస్ కంపెనీ’ సినిమా షూటింగ్ యథావిధిగా పునఃప్రారంభమైంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



