
హైదరాబాద్, సూర్య న్యూస్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ (Telugu University) లో గురుపూజోత్సవ వేడుకలు వినూత్నంగా జరిగాయి. జర్నలిజం విభాగం విద్యార్థులు తమ అధ్యాపకులపై ఉన్న గౌరవంతో ‘గురుదక్షిణ’ (Gurudakshina) పేరిట ముద్రించిన కవితా సంకలనాన్ని గురువులకు అంకితం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అంజిబాబు ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందించింది. యూనివర్సిటీకి చెందిన విద్యార్థులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది కవులు గురువుల గొప్పదనాన్ని వివరిస్తూ రాసిన కవితలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
కార్యక్రమంలో భాగంగా కవితా సంకలనాన్ని యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు ఆవిష్కరించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే అద్భుతమైన కవితలతో, ఆకర్షణీయమైన డిజైన్తో పుస్తకాన్ని తీసుకురావడం పట్ల సంపాదకులు కొండూరి కోటి బాబు, ఎస్. కల్యాణ్ దాస్, నాగుల అంజిబాబులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వీరు భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. నేటి సమాజంలో గురువులను గౌరవించుకోవడం గొప్ప సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. జీవితంలో ఎందరో గురువులు ఉంటారని, ప్రతి విద్యార్థి నుంచి ఉపాధ్యాయులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అంజిబాబు ఫౌండేషన్కు రిజిస్ట్రార్ ప్రశంసలు
విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆర్థిక అండదండలు అందించిన అంజిబాబు ఫౌండేషన్ చొరవను రిజిస్ట్రార్ హనుమంతరావు అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలను కొనసాగించాలని ఫౌండేషన్ సీఈఓ నాగుల అంజిబాబుకు సూచించారు. అనంతరం సీఈఓ అంజిబాబు మాట్లాడుతూ, ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి కార్యక్రమం గురుపూజోత్సవం నాడు జరగడం సంతోషంగా ఉందన్నారు. విద్యావంతుడిగా తన ఎదుగుదలకు కారణమైన గురువులకు ఈ రూపంలో నివాళి అర్పించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ఆకట్టుకున్న విద్యార్థుల చొరవ
పుస్తక రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన సంపాదకులు కోటి బాబు, కల్యాణ్, అంజిబాబుల కృషి అభినందనీయమని జర్నలిజం విభాగం సీనియర్ అధ్యాపకురాలు షేక్ హసీనా కొనియాడారు. వారిని త్రిమూర్తులుగా అభివర్ణించారు. ప్రధాన సంపాదకుడు కోటి బాబు మాట్లాడుతూ, వీసీ, రిజిస్ట్రార్, ఇతర అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఈ సంకలనం సాధ్యమైందన్నారు. గురుదక్షిణకు స్వల్ప కాలంలోనే విశేష స్పందన లభించిందని సంపాదకుడు కల్యాణ్ దాస్ తెలిపారు. కవితలు రాసిన కవులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగీత విభాగం ఆచార్యులు బి. రాధ, ఓ. విజయ్ తదితర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



