
బీర్భూమ్, సూర్య న్యూస్ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (CM Mamata Banerjee), తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడి కుమార్తె బృష్టి ముఖర్జీ (28) బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్ హాట్ సమీపంలోని కుసుంబా గ్రామంలో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఆమె గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నివేదికతో పాటు సమగ్ర విచారణ జరిగిన తర్వాతే మృతికి గల పూర్తి కారణాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. మృతురాలి తండ్రి నిహార్ ముఖర్జీ స్థానికంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగుతున్నారు.
ఉద్యోగం కోల్పోవడం.. విడాకుల వ్యవహారమే కారణమా?
బృష్టి ముఖర్జీ గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దానికి సంబంధించి చికిత్స కూడా పొందుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె విడాకుల కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉందని వారు తెలిపారు. దీనికి తోడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఉద్యోగం పోయినప్పటి నుంచి ఆమె మరింత ఆందోళనకు గురైనట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
అలాగే, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల నియామకాల కుంభకోణానికి సంబంధించి కూడా బృష్టి ముఖర్జీ గతంలో ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఒకవైపు ఉద్యోగం కోల్పోవడం, దీనికి తోడు భర్తతో విడాకుల అంశం ఆమె ఆత్మహత్యకు కారణం కావొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



