
పశ్చిమ బెంగాల్, సూర్య న్యూస్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఒక్కసారిగా సెగలు పుట్టించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా అధికార టీఎంసీ (TMC) నేతలకు ఆయన అల్టిమేటం జారీ చేశారు. అవినీతికి పాల్పడిన వారు, మాఫియా ముఠాలు నడుపుతున్న వారు ఈ నెల 29 లోపు పోలీసు స్టేషన్లకు వెళ్లి లొంగిపోవాలని, లేదంటే మే 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
పురూలియాలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న మోడీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) టార్గెట్గా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధిని టీఎంసీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఆదివాసీల భూములను సిండికేట్లు ఆక్రమించుకున్నాయని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు ప్రతి పనికీ ‘కట్-మనీ’ (Cut-money) కమిషన్లు వసూలు చేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారని మోడీ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని నిరుద్యోగితపై కూడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో (Teacher Recruitment) జరిగిన అవకతవకలు వేలాది మంది యువత జీవితాలను అంధకారంలోకి నెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో రోడ్లు, విద్యుత్, ఆసుపత్రులు వంటి కనీస సౌకర్యాలు కూడా దయనీయంగా మారాయని విమర్శించారు. బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సిండికేట్ రాజ్యానికి చరమగీతం పాడుతామని, వ్యవస్థను క్లీన్ చేస్తామని ప్రధాని మోడీ శపథం చేశారు. ఈసారి బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, భారీ మెజారిటీతో బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.