
అమరావతి, సూర్య న్యూస్ : రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన నాయకత్వ లక్షణాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీ అనవసర విమర్శలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) మండిపడ్డారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్ల కూటమి పాలనలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల ద్వారా 8 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు ఆమె స్పష్టం చేశారు.
మెగా డీఎస్సీతో పాటు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నియామకాలు, ఎంఎస్ఎంఈ, స్కిల్ డెవలప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక రంగాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచామని అనురాధ వివరించారు. ఈ వాస్తవాలను జీర్ణించుకోలేని వైఎస్సార్సీపీ నేతలు.. ఉద్దేశపూర్వకంగానే మెగా డీఎస్సీపై నిందలు వేస్తూ లోకేష్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో డీఎస్సీ ద్వారా కల్పించిన ఉద్యోగాలు శూన్యమని, ఎన్సిఆర్బి సర్వే ప్రకారం నిరుద్యోగంతో సుమారు 4,100 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ స్కామ్
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, సిట్ విచారణలో సుమారు రూ. 150 కోట్ల కుంభకోణం బయటపడిందని అనురాధ ఆరోపించారు. ప్రభుత్వ స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రశ్నపత్రాలను ప్రైవేట్ రిసార్ట్లకు తరలించి, అనర్హుల చేత మూల్యాంకనం చేయించారని విమర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ ఈ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ, కియా అనుబంధ సంస్థలు, అమర్రాజా సహా అనేక పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి యువతను గంజాయికి బానిసలుగా మార్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపటి నుంచి ‘యువత భవితకు భరోసా’
కూటమి ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ కల్పన, మెగా డీఎస్సీలో పారదర్శకతను నేరుగా యువతకు వివరించేందుకు ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు ‘యువత భవితకు భరోసా’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అనురాధ ప్రకటించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లలో పర్యటించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన ఏపీపీఎస్సీ అక్రమాలను సైతం వివరిస్తామన్నారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీ కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



