Skip to content
Home » ఉచిత బస్సు పథకం మహిళలకు వరమే.. కానీ ఆర్టీసీ కార్మికుల కష్టాలు పట్టవా: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఉచిత బస్సు పథకం మహిళలకు వరమే.. కానీ ఆర్టీసీ కార్మికుల కష్టాలు పట్టవా: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, సూర్య న్యూస్: రాష్ట్రంలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఎంతో మేలు చేకూరుస్తోందని, అయితే ఈ పథకాన్ని విజయవంతం చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం విస్మరించడం సరికాదని శాసనమండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బుధవారం శాసనమండలిలో జరిగిన చర్చా సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. గేదెకు పాలు పిండి గడ్డి వేయకపోతే ఎలా అధ్యక్ష అంటూ ప్రభుత్వ తీరును ఆయన ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపిస్తలేవా?

మహిళల ప్రయాణం సురక్షితంగా సాగడం మంచి పరిణామమే అయినప్పటికీ, ఆ బస్సును నడిపే డ్రైవర్ చెమట, కండక్టర్ కష్టం మరియు ఇతర ఆర్టీసీ కార్మికుల బాధలు ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని తీన్మార్ మల్లన్న నిలదీశారు. ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన రెండు పీఆర్సీ (PRC) లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించినప్పుడే ఉచిత బస్సు పథకానికి పూర్తి స్థాయిలో అర్థం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ఎన్నికల హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆటో డ్రైవర్ల జీవితాలు భారమవ్వకూడదు

ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధి తీవ్రంగా దెబ్బతిందని, వారి జీవితాలు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లను కూడా ఈ పథకంలో భాగంగా చేసి, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. సమాన న్యాయం జరిగినప్పుడే సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని ఆయన సూచించారు. ప్రభుత్వం కేవలం పథకాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో నడిపించే వారి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.